ప్రజలకు నరకం చూపిస్తున్న ఏపీ సర్కార్: దేవినేని
ABN , First Publish Date - 2022-04-22T20:27:20+05:30 IST
ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలకు ఏపీ సర్కార్ నరకం చూపిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ దుయ్యబట్టారు.
అమరావతి: ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలకు ఏపీ సర్కార్ నరకం చూపిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల బాదుడు, కమీషన్ల కక్కుర్తిపై ఉన్న శ్రద్ధ.. ప్రభుత్వానికి విద్యుత్ సరఫరాపై లేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో 24 గంటల సరఫరాతో మిగులు విద్యుత్గా ఉన్న ఏపీని.. చీకట్లోకి నెట్టడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
ఏపీలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటిదాకా పల్లెలకు మాత్రమే పరిమితమైన విద్యుత్ కోతలు.. ఇప్పుడు పట్టణాలకూ వ్యాపించాయి. ఎండ వేడితోపాటు కరెంటు కష్టాలూ పెరిగిపోయాయి. ‘అసలే ఉక్కపోత.. ఆపై కరెంటు కోత’ అంటూ రాష్ట్రమంతా జనం ఆపసోపాలు పడుతున్నారు. కొన్నిచోట్ల ఉదయం ఐదు గంటలు.. సాయంత్రం రెండు విడతలుగా గంట చొప్పున రోజుకు ఏడు గంటలు ‘పవర్ కట్’ చేస్తున్నారు.