జాబ్ నోటిఫికేష్ అడిగితే జైల్లో పెడతారా?: Ramakrishna
ABN , First Publish Date - 2022-03-12T13:48:46+05:30 IST
జాబ్ నోటిఫికేషన్ అడిగితే జైల్లో పెడతారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జాబ్ నోటిఫికేషన్ అడిగితే జైల్లో పెడతారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ నోటిఫికేషన్ విడుదల కోరుతూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేడు విజయవాడలో ధర్నా చేపట్టిందని తెలిపారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం దుర్మార్గమన్నారు. ఏపీలో 2.35 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉండగా, 66 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం యువతకు ద్రోహం చేయడమే అని అని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.