కంచడంలో పంచేశారు..
ABN , First Publish Date - 2022-10-29T00:57:42+05:30 IST
బినామీ పేర్లతో పంట రుణాలను మింగేశారు.. 400 పొటాష్ బస్తాలను రైతులకు ఇవ్వకుండా కాజేశారు.. ఆఖరుకు హమాలీలకు ఇవ్వాల్సిన కూలీ డబ్బును కూడా దోచేశారు.. కంచడం పీఏసీఎస్లో జరుగుతున్న అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
400 బస్తాల ఎరువులు విక్రయించి నగదు జమ చేయని వైనం
హమాలీల డబ్బునూ లాగేశారు
బినామీ కౌలు రైతుల పేరున పంట రుణాలు
ప్రశ్నించిన రైతులకు బెదిరింపులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రైతులకు సకాలంలో పంట రుణాలు అందజేసి ఆదుకోవాల్సిన ప్రాథమిక వ్యవ సాయ సహకార పరపతి సంఘంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. బంటుమిల్లి మండలం కంచడం ప్రాథమిక వ్యవ సాయ సహకార పరపతి సంఘంలోని నగదును సొంత అవసరాలకు వాడేసుకున్నారు. రైతులు ఈ అంశంపై ప్రశ్నిస్తే తమకు మంత్రి అండ ఉందని బెదిరింపులకు దిగారు. బినామీ పేర్లతో కౌలు రైతుల కార్డులు సృష్టించి పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్నారు. పీఏసీఎస్కు వచ్చిన ఎరువులను రైతులకు విక్రయించకుండా అధికార పార్టీకి చెందిన పంచాయతీ సర్పంచ్ బండారు చంద్రశేఖర్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి గంధం శేషయ్య, కార్యదర్శి నాగమల్లేశ్వరరావు కూడబలుక్కుని బహిరంగ మార్కెట్లో విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నగదును జమ చేయకుండా తమ వద్దే ఉంచేసుకున్నారు. రైతులు ఆరా తీయగా, ఎట్టకేలకు కంచడం పీఏసీఎస్లో జరిగిన అవకవతవకలు బహిర్గతమయ్యాయి. పీఏసీఎస్ల లో ఏం జరుగుతుందో పర్యవేక్షించాల్సిన కేడీసీసీ బ్యాంకు అధికారులు మిన్నకుండిపోవడం వల్లే ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయి.
400 బస్తాల పొటాష్ను విక్రయించేశారు
కంచడం పీఏసీఎస్ను సర్పంచ్, పర్సన్ ఇన్చార్జి తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కార్యదర్శిని తమ చెప్పుచేతల్లో ఉంచుకుని చిత్తానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ పీఏసీఎస్కు 2021, డిసెంబరులో 400 బస్తాల పొటాష్ ఎరువు వచ్చింది. దాళ్వా పంట లేకున్నా ఈ ఎరువును దిగుమతి చేసుకోవడం విశేషం. సుమారు రూ.5 లక్షల విలువైన పొటాష్ ఎరువుల బస్తాలను గుట్టుచప్పుడు కాకుండా రొయ్యలు, చేపల చెరువుల యజమానులకు విక్రయిం చేశారు. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎరువులు విక్రయించిన నగదు ఏమైందని రైతులు ప్రశ్నించారు. ఈ నగదును జమ చేశామని పీఏసీఎస్ కార్యదర్శి, పర్సన్ ఇన్చార్జి చెబుతూ వచ్చారు. నగదు చెల్లించినట్లుగా రసీదులు చూపమని రైతులు కోరితే, బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. డిసెంబరులో విక్రయించిన ఎరువులకు సంబంధించిన నగదును ఈ నెల 6వ తేదీన బంటుమిల్లి కేడీసీసీ బ్రాంచ్లో చెల్లించామని కార్యదర్శి నాగమల్లేశ్వరరావు తెలిపారు.
కౌలు రైతుల బినామీ రుణాలు
కంచడం పీఏసీఎస్ నుంచి కౌలు రైతుల పేరుతో గుర్తింపు కార్డులు తయారుచేసి బినామీ పేర్లతో సర్పంచ్, పీఏసీఎస్ అధ్యక్షుడు పంట రుణాలను తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అవకతవకలపై కేడీసీసీ బ్యాంకు అధికారులు శుక్రవారం వివరాలు రాబట్టారు. ఆ సమయానికి పీఏసీఎస్ కార్యదర్శి నాగమల్లేశ్వరరావు అందుబాటులో లేరు.
హమాలీల నగదునూ వాడేసుకున్నారు
గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి హమాలీ కూలీ ఖర్చు నిమిత్తం రూ.3.50 లక్షలు విడుదలయ్యాయి. పర్సన్ ఇన్చార్జి, కార్యదర్శి ఈ నగదును హమాలీలకు చెల్లించలేదు. ఇటీవల మంత్రి జోగి రమేశ్ కంచడం గ్రామంలో పర్యటించిన సమయంలో.. తమకు రావాల్సిన నగదును చెల్లించలేదని హమాలీలు ఫిర్యాదు చేశారు. మంత్రి స్పందించి అధికారులను వివరాలు కోరగా, నగదును విడుదల చేశామని చెప్పారు. వెంటనే హమాలీల కూలీ చెల్లించాలని మంత్రి ఆదేశించారు. ఆ తరువాత కొంత మొత్తాన్ని చెల్లించి మిగిలిన నగదు రాలేదని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
మంత్రి అండతోనే ఈ అక్రమాలు
మంత్రి అండతో వైసీపీ నాయకులు రైతులను నట్టేట ముంచుతున్నారు. కంచడం పీఏసీఎస్లో గత ఏడాది డిసెంబరులో పొటాష్ అమ్మకపు నగదు బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేశారు. ప్రశ్నించిన రైతులపై ఎదురుతిరగడం అన్యాయం. దొంగ కౌలురైతు గుర్తింపు కార్డులు సృష్టించి రైతులకు తెలియకుండానే రుణాలు పొందారు. చివరికి రైతులకు చెందాల్సిన హమాలీ ఖర్చులు కూడా సంక్రాంతి సరదాలకు ఖర్చు పెట్టుకు న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకు చెంద కుండా అధ్యక్షుడు, ప్రెసిడెంట్, పీఏసీఎస్ సెక్రటరీలు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ పెడన ఇన్చార్జి