ఇంటికి రా.. స్నానం చేయిస్తా!
ABN , First Publish Date - 2022-09-09T08:37:12+05:30 IST
ఇంటికి రా.. స్నానం చేయిస్తా!
మహిళా కార్యదర్శితో ఎంపీడీఓ ప్రేలాపనలు.. గ్రామస్థుల దేహశుద్ధి
ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘మా ఇంటికి రా.. స్నానం చేయిస్తా...! ఓ కిస్ ఇస్తావా..! పోనీ ఎక్కడికి రమ్మంటావు..!!’’ పంచాయతీ మహిళా కార్యదర్శితో ఓ ఎంపీడీఓ కామ ప్రేలాపనలు ఇవి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన ఒక మహిళా కార్యదర్శిని ఎంపీడీఓ పఠాన్ఖాన్ చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, గ్రామస్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. వేధింపులపై పఠాన్ఖాన్ను నిలదీశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఎంపీడీవో తెలపడంతో, గ్రామస్థులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎంపీడీఓ షర్టు పట్టుకొని.. రా రా బయటకు అంటూ లాగింది. చేయి చేసుకుంది. ఎంపీడీఓ కూడా తిరగబడి, చేయి చేసుకున్నారు. దీంతో గ్రామస్థులంతా ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఎంపీడీఓను కాపాడటానికి ప్రయత్నించిన సిబ్బందికీ దెబ్బలు తప్పలేదు. ఇందుకూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కేసు నమోదు చేశారు. ఎంపీడీఓ వేధింపులను తట్టుకోలేక కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఫోన్లో అతడు పెట్టే మెసేజ్లు, వాయిస్ రికార్డులు చూసి ఆ అమ్మాయి సంసారం కూలిపోయే ప్రమాదం వచ్చిందని కార్యదర్శి బంధువులు తెలిపారు. ఎంపీడీఓను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ చక్రధర్బాబు ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. జడ్పీ సీఈఓ, డీపీఓ, నెల్లూరు ఆర్డీఓ, ఐసీడీఎస్ పీడీలతో ఇద్దరు ఎన్జీవోలతో కమిటీ వేశారు. ఈ కమిటీ శుక్రవారం ఇందుకూరుపేటకు వెళ్లి విచారణ చేపడతారు. వీరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.

