సీఎం జగన్ సమీక్ష.. అదనపు ఆదాయాలపై కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2022-02-16T23:43:36+05:30 IST
ఆదాయాన్ని ఆర్జించే శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయాలకోసం..
అమరావతి: ఆదాయాన్ని ఆర్జించే శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని, రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.