Ap Health Department: ప్రభుత్వ వైద్యులకు కీలక సూచన
ABN , First Publish Date - 2022-09-01T00:34:20+05:30 IST
వైద్య శాఖలో మూడేళ్లలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ...
విజయవాడ (vijayawada): వైద్య శాఖలో మూడేళ్లలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు (Chief Secretary Medical Health Department Krishna Babu)తెలిపారు. 4500 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని తీసుకున్నామని.. PHCలో టెలి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రూ. 16,255 కోట్లతో అన్ని స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని.. గైనకాలజిస్టులు, మత్తు మందు డాక్టర్లు లేరని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని.. గిరిజన ప్రాంతాల్లో వైద్యులను ప్రోత్సహించేందుకు ఎక్కువ జీతం ఇస్తున్నామని కృష్ణబాబు పేర్కొన్నారు.
స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా త్వరలో ఆదేశాలు ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు స్పష్టం చేశారు. CHC, ఏరియా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు పెరుగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో ప్రైవేట్ హాస్పిటల్స్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని కృష్ణబాబు చెప్పారు.
‘‘బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత డాక్టర్ల పనితీరు మెరుగుపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే చర్యలు తీసుకుంటాం. కర్నూలు టీచింగ్ హాస్పిటల్ నుంచి వైద్యులపై ఫిర్యాదులు అందాయి. వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై దృష్టి పెట్టాలని కర్నూల్ జీజీహెచ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్కు అదేశాలిచ్చాం. వైద్యారోగ్య శాఖలో సిబ్బందికి ఫేస్ రికగ్నైషన్ యాప్ ఆలోచన లేదు.’’ అని కృష్ణబాబు స్పష్టం చేశారు.