Chandrababu tweet: జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-08-05T17:30:33+05:30 IST
జగన్ పాలనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలి అనుకుంటే... రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిపై ...

అమరావతి (Amaravathi): జగన్ (Jagan) పాలనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలి అనుకుంటే... రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తమవుతోందన్నారు. ‘‘కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు.... జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెనపై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్పై కేసు పెట్టి అరెస్టు చెయ్యడం ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యం. విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా?.. పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే.... రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి... వెంటనే అందరినీ విడుదల చెయ్యాలి.. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలి.’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.