కర్నూలు: గోనెగండ్ల పాఠశాల ఘటనపై చంద్రబాబు స్పందన
ABN , First Publish Date - 2022-04-28T21:13:44+05:30 IST
జిల్లాలోని గోనెగండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై టీడీపీ
కర్నూలు: జిల్లాలోని గోనెగండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. స్కూల్లో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారులకు తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. స్కూల్ పునరుద్ధరణ కోసం ఏమీ చేయట్లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోలేదంటే ఏమనాలని ఆయన మండిపడ్డారు.
మీ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల చిన్నారులు రక్తం చిందించాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటని ట్విటర్లో ఆయన పేర్కన్నారు. ఇకనైనా పాఠశాలల్లో మౌలిక వసతుల పట్ల శ్రద్ధ చూపాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.