60 మంది TDP కార్యకర్తలను హత్య చేశారు.. 4 వేల మందిపై కేసులు పెట్టారు: Chandrababu
ABN , First Publish Date - 2022-06-10T20:15:13+05:30 IST
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Amaravathi: జగన్ (Jagan) ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్లీ కార్యాలయంలో మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ (YCP) పాలనలో ఏపీని వల్లకాడు చేశారన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, వారు తమ బాధలను చెప్పుకునే వీల్లేకుండా ప్రజల నోళ్లను నొక్కి పెట్టారన్నారు. దీంతో చాలా మంది బలవన్మరణాలకు గురయ్యారని, చాలా చోట్ల హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, 4 వేల మందిపై కేసులు పెట్టారని, నలుగురు మంత్రులను.. ఆరుగురు నేతలను అరెస్టులు చేశారని మండిపడ్డారు. 60 మంది పార్టీ నేతలను కేసులతో వేధించే ప్రయత్నం చేశారన్నారు.
మహిళలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై హత్యాకాండ సాగించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ ప్రభుత్వం వల్ల బడుగు వర్గాలకు చెందిన వారే 291 మంది చనిపోయారు.. వీళ్లా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది. ఇలా ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందర్ని ఇబ్బందులు పెట్టారు.. హత్యాకాండ సాగించారు. ఇక ప్రభుత్వ వైఫల్యాల వల్లే చాలా మంది ప్రాణాలు కొల్పోయిన పరిస్థితి. ఈ ప్రభుత్వానికి భయపడకుండా కట్టడి చేయాలి.. లేకుంటే భయమే ప్రజల్ని చంపేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. కొత్త డీజీపీ వచ్చాక.. ఏపీలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. నేరస్థుడు పరిపాలిస్తున్నారు కాబట్టి.. పోలీసులు నేరస్తులకు వంతపాడుతున్నారా..? పోలీసుల తీరు మారకుంటే.. మేమే మారుస్తాం.. ఏ విధంగా చేయాలో మాకు తెలుసు’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.