ఎప్పటికి పూర్తవుతుందో.. ఇప్పుడే చెప్పలేం!
ABN , First Publish Date - 2022-05-20T08:45:15+05:30 IST
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు ఫోరెన్సిక్ లేబొరేటరీల నుంచి కీలకమైన నివేదికలు అందాల్సి ఉందని సీబీఐ
వివేకా హత్య కేసు దర్యాప్తుపై హైకోర్టుకు సీబీఐ జవాబు
దర్యాప్తు అధికారి డ్రైవర్కు పిటిషనర్ల అనుచరుల బెదిరింపులు
బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు
సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడి
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు ఫోరెన్సిక్ లేబొరేటరీల నుంచి కీలకమైన నివేదికలు అందాల్సి ఉందని సీబీఐ తెలిపింది. అందుచేత దర్యాప్తును ఎంతకాలంలో పూర్తి చేస్తామనేది ఈ దశలో నిర్దిష్టంగా చెప్పలేమని హైకోర్టుకు నివేదించింది. ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ ల్యాబ్ల నుంచి అందే రిపోర్టుల ఆధారంగా తదుపరి విచారణ ముందుకు సాగుతుందని సీబీఐ తరఫు న్యాయవాది ఎ.చెన్నకేశవులు వివరించారు. హత్యకు సంబంధించి తాజా వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. పాలనాపరమైన అనుమతులు, వసతుల కల్పన విషయంలో స్థానిక అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల అనుచరులు.. దర్యాప్తు అధికారి డ్రైవర్ను బెదిరించడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేస్తే.. దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఫోరెన్సిక్ నివేదికలను తదుపరి విచారణ నాటికి తెప్పించుకోవాలని సీబీఐని ఆదేశించింది. లేకుంటే మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఆదేశాలిచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ (ఏ-2), గజ్జల ఉమాశంకర్రెడ్డి(ఏ-3), డి.శివశంకర్రెడ్డి(ఏ-5)లను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
గురువారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. శివశంకర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. పిటిషనర్ విషయంలో సీబీఐ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసిందని, మరింత కాలం జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగించడం పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. ఇప్పటికే పిటిషనర్ తరఫు వాదనలు ముగిశాయని.. వ్యాజ్యంలో నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫోరెన్సిక్ నివేదికలు అందడానికి మరికొంత సమయం పడుతుందని సీబీఐ చెబుతున్న నేపఽథ్యంలో మరికొంత సమయం ఇద్దామని అన్నారు. బెయిల్ మంజూరులో పిటిషనర్ల వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు ఫిర్యాదుదారుల అభ్యంతరాలు కూడా పరిగణణలోకి తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.