రెడ్డి రాజ్యంలో పని చేయలేను
ABN , First Publish Date - 2022-08-10T09:37:25+05:30 IST
రెడ్డిరాజ్యంలో ఉద్యోగం చేయలేకపోతున్నానని అనంతపురం నుంచి కలికిరి జేఎన్టీయూకి బదిలీపై వెళ్లిన సూపరింటెండెంట్ ఎండీ నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు.
- త్వరలో వీఆర్ఎస్ తీసుకుంటా
- కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం
అనంతపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రెడ్డిరాజ్యంలో ఉద్యోగం చేయలేకపోతున్నానని అనంతపురం నుంచి కలికిరి జేఎన్టీయూకి బదిలీపై వెళ్లిన సూపరింటెండెంట్ ఎండీ నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ప్రకటనతోపాటు వాట్సాప్ వీడియో విడుదల చేశారు. అనంతపురం జేఎన్టీయూలో పని చేస్తున్న తనను వైసీపీ విద్యార్థి సంఘం ఫిర్యాదు మేరకు కలికిరి జేఎన్టీయూకి బదిలీ చేశారన్నారు. అనంతపురంలో ఉద్యోగోన్నతి పొందిన తర్వాతే బదిలీ చేయడం ఆనవాయితీ అని, దానిని తుంగలో తొక్కి ఉద్దేశపూర్వకంగా తనను బదిలీ చేశారని వాపోయారు. బలహీనవర్గానికి చెందిన తాను రిజర్వేషన్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తుండటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. తన భార్య ఉద్యోగిగా ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా 250 కిలోమీటర్ల దూరంలోని కలికిరి బదిలీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కలికిరి జేఎన్టీయూలో సూపరింటెండెంట్ పోస్టు లేకపోయినా అక్కడికి బదిలీ చేశారని, తన ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు.