సీపీసీఆర్ఐ ఏర్పాటు ప్రతిపాదనలు రద్దు
ABN , First Publish Date - 2022-03-16T09:22:29+05:30 IST
సీపీసీఆర్ఐ ఏర్పాటు ప్రతిపాదనలు రద్దు
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో రీజనల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీసీఐఆర్ఐ) ఏర్పాటు ప్రతిపాదనలు రద్దు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ మార్గని భరత్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తూర్పు గోదావరి లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, అందుకు సామర్లకోటలో 18.71 ఎకరాల భూమిని కేటాయించిందని, అయితే, ఆ భూమి కేంద్రం ఏర్పాటుకు సరిపోని కారణంగా ప్రతిపాదనలను ముగించేశామని స్పష్టం చేశారు. కాగా, ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన పథకం కింద రివర్ రాంచింగ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించలేదని వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, జి.మాధవి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మత్య్స శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. రాష్ట్రంలో మత్య్స అభివృద్ధికి ఈ పథకం కింద 2020-21- 2021-22లో కలిపి రూ.657.1 కోట్లు ఆమోదించి రూ.115.6 కోట్లు విడుదల చేశామన్నారు..