దొనకొండ విమానాశ్రయంలో.. ‘ఆర్మీ’ డ్రోన్ల తయారీ
ABN , First Publish Date - 2022-08-15T08:52:02+05:30 IST
దొనకొండ విమానాశ్రయంలో.. ‘ఆర్మీ’ డ్రోన్ల తయారీ
మానవ రహిత ఫైటర్లు కూడా
కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన జానెట్ టెక్నాలజీస్
భూమి, వసతులను పరిశీలించిన గన్నవరం ఎయిర్పోర్టు సీనియర్ మేనేజర్
దొనకొండ, ఆగస్టు 14: ప్రకాశం జిల్లా దొనకొండ విమానాశ్రయంలో డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. బ్రిటిష్ కాలంలో దాదాపు 150 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇక్కడ భారత సైన్యానికి ఉపకరించే మానవ రహిత యుద్ధ విమానాలు, డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఢిల్లీలోని నొయిడాకు చెందిన జానెట్ టెక్నాలజీస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం సీనియర్ మేనేజర్ నెమలికంటి వంశీకృష్ణ, జానెట్ సంస్థ ఫీల్డ్ ఇన్చార్జి సీహెచ్ బాలు ఆదివారం దొనకొండ విమానాశ్రయ భూమి హద్దులను, భవనాలను, హెలిప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఇక్కడ మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఢిల్లీకి చెందిన జానెట్.. ఎయిర్పోర్ట్ అఽథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ప్రతిపాదనలు పంపిందన్నారు. ఈ ప్రదేశంలో భూమి, ఇతర మౌలిక సౌకర్యాలు, ఫ్లయింగ్ సౌకర్యం తదితర వివరాలతో జానెట్ సంస్థ ఇచ్చే ప్రతిపాదనలను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలించి.. వివరాలను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్కు పంపుతారని చెప్పారు. డీజీసీఏ అనుమతి వచ్చాక ఈ ప్రాంతంలో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతారని తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ షెడ్లు, 500 మీటర్ల రన్వేను ఏర్పాటు చేస్తామని బాలు చెప్పారు. విమానాశ్రయానికి సమీపంలోని మౌలిక వసతులపై సమాచారమివ్వాలని వంశీకృష్ణ దొనకొండ ఎయిర్పోర్టు ఇన్చార్జి రామకృష్ణకు సూచించారు.