మీకు బాధ్యత లేదా!?
ABN , First Publish Date - 2022-04-28T07:33:05+05:30 IST
రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తీవ్ర
- ఆర్థిక ఉల్లంఘనలు పట్టించుకోరా?.. రాజకీయ నాయకుల సంగతి సరే.. మీరు ప్రొసీజర్స్ పాటించాలి కదా!
- ఎస్ఎస్ రావత్కు ఢిల్లీలో ఫుల్ క్లాస్.. బుగ్గనను బయటే ఉంచి కార్యదర్శిపై గుస్సా. రాష్ట్రం సమర్పించిన లెక్కలపై కేంద్రం అసంతృప్తి
- సరైన వివరాలతో మళ్లీ రావాలని పిలుపు.. రావత్ మనస్తాపం.. వారం రోజులు సెలవు
లెక్కల్లో గిమ్మిక్కులు చేస్తూ, అప్పులను దాచేస్తూ, నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మళ్లీ అప్పులు తెస్తున్న వైనంపై కేంద్రం మండిపడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్కు కేంద్ర అధికారులు బాగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
అమరావతి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే స్పష్టమవుతోంది. ఒకవైపు ఏదిఏమైనా అప్పులు తేవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి... మరోవైపు కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే... వారంపాటు ఆయన సెలవుపై వెళ్లినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కొత్త అప్పులకు అనుమతులు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, సత్యనారాయణ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే... పాత అప్పులకు సంతృప్తికరమైన లెక్కలు చెబితేనే కొత్త అప్పులకు అనుమతి ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో... రాష్ట్ర ప్రభుత్వం తూతూమంత్రంగా, తనదైన శైలిలో తప్పుడు లెక్కలు పంపింది. గత వారం బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎస్ఎస్ రావత్ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కలిశారు. ‘కొత్త అప్పులు ప్లీజ్’ అని వేడుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపిన లెక్కలను, అందులోని తప్పులను పరిశీలించిన కేంద్ర అధికారులు గుర్రుగా ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిందంతా విని... ఆయనను బయట కూర్చోవాలని సగౌరవంగా కోరారు. ఆ తర్వాత... ఎస్ఎస్ రావత్కు పూర్తిస్థాయిలో క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఇన్ని రకాల ఆర్థిక ఉల్లంఘనలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులుగా మీకు బాధ్యత ఉంటుంది కదా అని నిలదీశారు.
‘‘రాజకీయ నాయకులు ఏదైనా చెబుతారు. కానీ... అసలు పరిస్థితిని మీరు వివరించాలి కదా. ఉల్లంఘనలు జరగకుండా చూడాలి కదా! ప్రొసీజర్ను వివరించాలి కదా! ఇంకా ఎన్ని అప్పులు చేస్తారు?’’ అని కేంద్ర అధికారులు వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఈ ప్రశ్నలకు బదులివ్వలేక ఎస్ఎస్ రావత్ తన అసహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం.
అంతలోనే మరో తాఖీదు..
కేంద్రం అడిగిన అప్పుల లెక్కలకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి సమాధానం సమర్పించారు. రాష్ట్రం చేసిన అసలు అప్పుల లెక్క తేలాలంటే... బ్యాంకులు, నాబార్డు, ఎన్సీడీసీ, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇతర ఆర్థిక సంస్థలు, ఈఏపీ రుణాల కోసం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ నుంచి, కార్పొరేషన్లు, ఏజీ నుంచి విడివిడిగా సమాచారం తీసుకోవాలని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వెల్లడించింది.
రాష్ట్రం పంపిన అప్పుల లెక్కలపై కేంద్ర అధికారులూ సంతృప్తి చెందలేదు. ‘మీ లెక్కలన్నీ తప్పు. సరైన వివరాలతో మా ముందుకు రండి’ అంటూ రావత్కు లేఖ పంపించారు. అంతకుముందే ఢిల్లీ నుంచి వచ్చి శుక్రవారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. శని, ఆదివారాలు సెలవు. ఆ తర్వాత నుంచి వారం రోజుల పాటు రావత్ సెలవు పెట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు గట్టిగా క్లాస్ తీసుకోవడంతో మనస్తాపానికి గురైనందునే రావత్ సెలవు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
కొత్త అప్పుల కోసం తిప్పలు
జగన్ సర్కారు భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి, రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. కేంద్రం కళ్లకు గంతలుకట్టేసి వేలకోట్ల దొంగ అప్పులు చేసింది. ఎన్ని మార్గాల్లో అప్పులు తెచ్చారో చెప్పాలంటూ కేంద్రం నుంచి రాష్ట్రానికి 26 పేజీల లేఖ వచ్చింది. దీనిపై దాదాపు 3 వారాలు కసరత్తు అనంతరం సమర్పించిన సమాచారంలో కూడా తప్పులున్నట్టు కేంద్రం గుర్తించింది. ఇప్పటి వరకు పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలకు మినహా కేంద్రం ఏ రాష్ట్రానికీ కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులివ్వలేదు.