APSRTC: ఏపీ నుంచి దూర ప్రాంతాలకు బస్ జర్నీ చేసే ప్రయాణికులకు గుడ్న్యూస్..
ABN , First Publish Date - 2022-08-23T01:06:41+05:30 IST
ఆర్టీసీ కండక్టర్లకు త్వరలో ఈ పోస్ ఆధారిత యూనిఫైడ్ టిక్కెట్ సర్వీస్ (యూటీఎస్) మెషీన్లు రానున్నాయి. ప్రస్తుత టిమ్ మెషీన్లు..
ఆర్టీసీ కండక్టర్లకు త్వరలో ఈ పోస్ మెషీన్లు
యూటీఎస్ ద్వారా టిక్కెట్ల జారీ
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు
దూర ప్రాంతాలకూ బుకింగ్ అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీ కండక్టర్లకు త్వరలో ఈ పోస్ ఆధారిత యూనిఫైడ్ టిక్కెట్ సర్వీస్ (యూటీఎస్) మెషీన్లు రానున్నాయి. ప్రస్తుత టిమ్ మెషీన్లు మొరాయిస్తుండటం.. మాన్యువల్ టిక్కెట్లను ఇవ్వాల్సి రావటంతో.. ఆర్టీసీ ఉన్నతాధికారులు యూటీఎస్ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ నూతన విధానం అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో కండక్టర్లకు టిమ్ మెషీన్ల స్థానంలో ఎలక్ర్టానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పోస్) మెషీన్లను ఇస్తారు. ఇందులో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేస్తారు. ఈ పోస్ల ద్వారా సాధారణ టిక్కెట్ల జారీతో పాటు కార్డ్ స్వైపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రయాణికులు డబ్బులు లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా టిక్కెట్ ధర చెల్లించవచ్చు.
వీటితో పాటు ప్రయాణికులు ఆర్టీసీ కండక్టర్ల దగ్గరే దూర ప్రాంతాలకు రిజర్వేషన్ చేసుకోవచ్చు. టిక్కెట్ కూడా పొందవచ్చు. ఉదాహరణకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సిటీ బస్సుల్లో పీఎన్బీఎస్కు (పండిట్ నెహ్రు బస్ స్టేషన్) వచ్చి అక్కడి నుంచి వేరే బస్సులో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. మీరు ఎక్కిన సిటీ బస్సుల్లోని కండక్టర్ల దగ్గరే దూర ప్రాంత బస్సులకు కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. పీఎన్బీఎస్ రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర క్యూలో ఉండి టిక్కెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.