వివేకా కేసులో జగన్‌ను విచారించాల్సిందే: లోకేశ్‌

ABN , First Publish Date - 2022-03-05T08:06:54+05:30 IST

వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా..

వివేకా కేసులో  జగన్‌ను విచారించాల్సిందే: లోకేశ్‌

మంగళగిరి, మార్చి 4: వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు.  ‘‘ఈ హత్యలో ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు ఇప్పటికే స్పష్టంగా తేలిపోయింది. ఇది అందరికీ అర్థమైనప్పటికీ ఎంపీని రక్షించేందుకు జగన్‌రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. అది చూస్తుంటే మరెన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వివేకా హత్య తరువాత అవినాశ్‌రెడ్డి, జగన్‌ సతీమణి భారతీరెడ్డికి ఫోన్‌ చేసినట్టు సమాచారం ఉంది. ఆ తరువాత భారతీరెడ్డి తండ్రి గంగిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. గాయాలు కనిపించకుండా కుట్లు వేయించారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయించారు. ఇదంతా ఎందుకు చేయాల్సివచ్చింది? గంగిరెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ క్రైం కహానీలో తెరచాటు సూత్రధారులు ఇంకా ఎవరైనా ఉండి ఉండొచ్చనే అనిపిస్తోంది’’ అని అన్నారు. ప్రభుత్వ పెద్దలు తీర్పును హుందాగా గౌరవిస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘వైసీపీ నాయకుల అధికారమదం పరాకాష్ఠకు చేరింది. స్వయంగా మంత్రులే దుర్భాషలాడుతూ పోలీసులపై దాడులకు పాల్పడడం అరాచక పాలనకు నిదర్శనం’’ అని లోకేశ్‌ విమర్శించారు. అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితుడికి ఎకరాకు రూ.19 లక్షలిస్తానని హామీ ఇచ్చి... ఆ తర్వాత రూ.10 లక్షలు ఇస్తానని మాట మార్చి... ఇప్పుడు రూ.3 లక్షలిచ్చి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్న సీఎంని జగన్మోసంరెడ్డి అనాల్సిందే అని లోకేశ్‌ అన్నారు. 

Updated Date - 2022-03-05T08:06:54+05:30 IST