పాముకాటుతో విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-03-05T08:00:37+05:30 IST
విజయనగరం జిల్లా కురుపాం మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి..
మరో ఇద్దరి పరిస్థితి విషమం
కురుపాం బీసీ గురుకుల పాఠశాలలో ఘటన
కురుపాం, మార్చి 4: విజయనగరం జిల్లా కురుపాం మహాత్మాగాంధీ జ్యోతీబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. భోజనం అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న ఓ గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించింది. కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్ (13), వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను కాటువేసింది. వారిని ప్రాథమిక వైద్యం అనంతరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రంజిత్ మృతిచెందాడు. నవీన్, వంశీలకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శించారు.