ఏం తమాషాలు చేస్తున్నారా..?

ABN , First Publish Date - 2022-03-05T07:53:23+05:30 IST

కారు అడ్డుగా ఉంది తియ్యండి’ అన్నందుకు మంత్రి పేర్ని నాని పోలీసులపై ఫైర్‌ అయ్యారు....

ఏం తమాషాలు చేస్తున్నారా..?

  •  పోలీసులపై మంత్రి పేర్ని నాని చిందులు


పోలవరం, మార్చి 4: ‘కారు అడ్డుగా ఉంది తియ్యండి’ అన్నందుకు మంత్రి పేర్ని నాని పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ‘ఏం తమాషాలు చేస్తున్నా రా.. మర్యాదగా ఉండదు. నా కారునే తియ్యమంటా రా.. నేను ఈ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని.. డిజిగ్నేషన్‌ ఏమిటో తెలుసా? ఇవాళ్టితో పండగ అయిపోదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం జగన్‌ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో పేర్ని నాని శుక్రవారం వచ్చారు. అక్కడ పార్క్‌ చేసిన మంత్రి కారు అడ్డుగా ఉంది తియ్యాలని ప్రొటోకాల్‌ సిబ్బంది కోరగా.. వారిపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘కారు తియ్యమంది ఎవడో రండి.. మంచి, మర్యాద లేదు.. ఎవడి డిజిగ్నేషన్‌ ఏమిటో తెలీదు.. ఆ కారు ఎవడిది.. ఈ కారు ఎవడిది.. ఎవరివి ఈ కార్లన్నీ..? ఏం తమాషాలు చేస్తున్నారా..? కాన్వాయ్‌ ఎవరిదో తెలుసా..? ఎవరయ్యా కారు తియ్యమన్నది? ఎవరి కార్లు తియ్యమన్నాది..?’’ అని అక్కడున్న పోలీస్‌ అధికారిని ప్రశ్నించారు. దానికి ఆ అధికారి ‘సార్‌ చెప్పింది చెప్పాం’ అని వివరిస్తుండగా... ‘ఒకడు చెప్పేది ఏంటయ్యా.. ఇన్‌చార్జి మంత్రిని నేను గుర్తుపెట్టుకో.. మీ ఎస్పీ కారు, డీఐజీ కారు ఇక్కడ ఎందుకుంటాయి?’ అన్నారు. ‘రమ్మను.... నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ వాళ్లు..? మర్యాదగా ఉండదు’ అని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు.

Updated Date - 2022-03-05T07:53:23+05:30 IST