జగన్ రెడ్డి నాన్ లోకల్ సీఎం
ABN , First Publish Date - 2022-09-30T09:57:09+05:30 IST
జగన్ రెడ్డి నాన్ లోకల్ సీఎం
ఇక్కడ వసూళ్లు.. పక్క రాష్ట్రాలకు తరలింపులు
వైసీపీకి 127 సీట్లలో ఓటమి తప్పదు: టీడీపీ విమర్శ
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘మద్యం, ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఆ సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పైసా కూడా పెట్టుబడి పెట్టడం లేదు. ఈ రాష్ట్రంలో సొమ్ముతో పక్క రాష్ట్రాలను బాగు చేస్తున్న జగన్ రెడ్డి ఒక నాన్ లోకల్ ముఖ్యమంత్రి’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి గురువారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ కలెక్షన్ సెంటర్... హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై డిశ్పాచ్ సెంటర్లని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీలో నెలకొన్న అభద్రతాభావానికి వేస్తున్న ముసుగులని ఆయన అన్నారు. ‘వైసీపీకి రాష్ట్రంలో 175 సీట్లు వచ్చే వాతావరణం ఉంటే సీఎం జగన్ తన పర్యటనల్లో పరదాలు, బారికేడ్లు, పోలీసుల చాటున దాక్కోవడం ఎందుకు? అని విమర్శించారు. పీకే టీం సర్వేలో వైసీకి 127 అసెంబ్లీ సీట్లతో ఓటమి తప్పదని వచ్చిందని, అది ప్రజల్లోకి వెళ్లడంతో 27 సీట్లలో ఎమ్మెల్యేలను విలన్లుగా చూపిస్తూ పేర్లు లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పులివెందులలో ఈసారి గెలవలేమన్న భయంతో జగన్ రెడ్డి ఈసారి జమ్మలమడుగులో పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు లీకులు వదులుతున్నారని తెలిపారు. పులివెందులలో బస్టాండ్ కూడా కట్టలేని సీఎం జగన్.. రాష్ట్రంలో మూడు రాజధానులు కడతానని ప్రజలను నమ్మించాలని చూడటం పెద్ద జోక్’ అని శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీలో ఈసారి పోటీ చేయాలా వద్దా అని సగం మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తుంటే, టీడీపీలో ప్రతి సీటుకూ పది మంది టికెట్టు కోసం పోటీపడుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో దీనిని బట్టే తెలుస్తోందని ఆయనన్నారు. రాష్ట్రంలో పది ఇళ్లలో ఒక ఇంటికి మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందుకే వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడప కార్యక్రమంలో ఛీత్కారాలు, నిరసనలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు.