అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్‌పై కాగితాలు విసిరిన టీడీపీ సభ్యులు

ABN , First Publish Date - 2022-03-14T16:55:56+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన ఏపీ అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తోంది.

అసెంబ్లీలో గందరగోళం.. స్పీకర్‌పై కాగితాలు విసిరిన టీడీపీ సభ్యులు

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన ఏపీ అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తోంది. సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సభ్యుల ఆందోళనతో సభ ఒకసారి వాయిదా పడగా.. తిరిగి మొదలైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు మునుపటి సీన్ రిపీట్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారం పోడియం పైకెక్కి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి కాగితాలు చింపి తమ్మినేనిపై విసిరేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో మార్షల్స్ రంగంలోకి దిగారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలను తప్పుబడుతూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఆ పార్టీకి లేదన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచి.. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన దుర్మార్గుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లే ప్రశ్నలు వేస్తున్నారు.. వాళ్లే అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.


ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... మద్యం కమిషన్ల కోసం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారన్నారు. ప్రభుత్వం నుంచి దిగిపోయే ముందు కూడా బార్లకు లైసెన్సులిచ్చారని విరుచుకుపడ్డారు.  టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే శాసనసభ వాయిదా పడింది. స్పీకర్ తమ్మినేని సీతారాం టీ బ్రేక్ ఇచ్చారు. 

Updated Date - 2022-03-14T16:55:56+05:30 IST