సభలో టీడీపీ నిరసన.. స్పీకర్ ఆగ్రహం.. బాబుపై విరుచుకుపడ్డ కొడాలి
ABN , First Publish Date - 2022-03-14T16:29:43+05:30 IST
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ మరోసారి నిరసనకు దిగింది.

అమరావతి: వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ మరోసారి నిరసనకు దిగింది. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు.. టీడీపీకి లేదన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు. సీఎం జగన్ బెల్ట్ షాపులు రద్దు చేశారని తెలిపారు. అధికారంలో నుంచి దిగిపోయే ముందు బార్లకు ఐదేళ్లు లైసెన్సులు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. సహజ మరణాలను కూడా అక్రమ మద్యం మరణాలంటున్నారన్నారు. రాజకీయాల్లో ఆడవాళ్లను అడ్డం పెట్టుకున్న సన్నాసి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. సభకు అడ్డం పడుతోన్న టీడీపీ సభ్యులను బయటకు పంపాలని మంత్రి కొడాలని నాని అన్నారు.