నాటుసారా తయారీ గ్రామాలు 2,196
ABN , First Publish Date - 2022-12-31T04:51:08+05:30 IST
రాష్ట్రంలో 2,196 గ్రామాలను నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) వెల్లడించింది.
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2,196 గ్రామాలను నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) వెల్లడించింది. ఈ కేలెండర్ సంవత్సరంలో ఆపరేషన్ పరివర్తన్ కింద ఈ గ్రామాల్లో 26,461 కేసులు నమోదు చేసి, 17,348 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. 3,02,615 లీటర్ల నాటుసారా, 1,06,61,864 లీటర్ల బెల్లపు ఊట, 5,18,464 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఎన్డీపీఎల్కు సంబంధించి 5,216 కేసులు నమోదు చేసి, 5,715 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. బెల్టు షాపులపై 6,490 కేసులు నమోదుచేసి, 6,500 మందిని అరెస్టు చేశామని వివరించింది. గంజాయి సాగు, సింథటిక్ డ్రగ్స్ వినియోగంపై 344 కేసులు పెట్టి, 633 మందిని అరెస్టు చేసి, 26,242 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపింది. ఇసుక అక్రమ రవాణాపై 3,746 కేసులు నమోదుచేసినట్లు పేర్కొంది.