కాంగ్రెస్ చలో అమలాపురం భగ్నం
ABN , First Publish Date - 2022-05-27T09:08:06+05:30 IST
కాంగ్రెస్ చలో అమలాపురం భగ్నం
కుల, మత ఉన్మాదులు అంబేడ్కర్ను అవమానించారు: శైలజానాథ్
విజయవాడ గాంధీనగర్, మే 26: కాంగ్రెస్ తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్తోపాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. తొలుత అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోనసీమ అల్లర్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు. ‘‘కోనసీమలో మతోన్మాదులు, కులోన్మాదులు అంబేడ్కర్ను అవమానించారు. కుట్రలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించింది. మంత్రి ఇంటిపై జరిగిన దాడి అనుమానాలకు తావిస్తోంది. మంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ప్రజలకు ప్రభుత్వం ఏవిధంగా రక్షణ కల్పిస్తుంది?’’ అని ప్రశ్నించారు. అనంతరం చలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరుతుండగా నాయకులను అరెస్టు చేసి, సాయంత్రం విడిచిపెట్టారు.