విశాఖలో టీ 20 మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: ACP
ABN , First Publish Date - 2022-06-13T19:12:50+05:30 IST
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే టీ 20 మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
విశాఖపట్నం: భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే టీ 20 మ్యాచ్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్( ACP Srinivas) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... స్టేడియం లోపల వెలుపల 725 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. స్టేడియం నలుమూలలా సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్టేడియం నిఘా నేపథ్యంలో స్టేడియం లోపల ఎనిమిది మందితో ప్రత్యేకంగా బైనాక్యులర్తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఫ్లెక్సీలు, జెండా కర్రలు, తినుబండారాలు స్టేడియం లోపలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు స్టేడియానికి చేరుకోవాలన్నారు. క్రీడాభిమానులు సాధ్యమైనంత వరకు బస్సులనే రవాణా సౌకర్యంగా వాడుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ సూచనలు చేశారు.
ఏసీఏ ట్రెజరర్ గోపీనాథ్ మాట్లాడుతూ... భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే 3వ టీ20 మ్యాచ్కు క్రికెట్ స్టేడియం సిద్ధమైందని ఏసీఏ ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖ స్టేడియం అంటేనే... క్రీడాకారులకు సెంటిమెంట్గా మారిందన్నారు. స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వర్షం కురిసినా... అరగంట విరామం ఇస్తే... మ్యాచ్ సజావుగా సాగిస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపైనా ఉందని గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.