మరో 4 రోజులు పంటల బీమా నమోదు
ABN , First Publish Date - 2022-07-01T09:37:57+05:30 IST
మరో 4 రోజులు పంటల బీమా నమోదు
అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గతేడాది ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించి పరిహారం అందని రైతులు మళ్లీ ఆన్లైన్లో నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల గడువు బుధవారంతో ముగిసినా వ్యవసాయ శాఖ గురువారం కూడా అర్హుల జాబితాను విడుదల చేయలేదు. మరో నాలుగు రోజులు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 2021 ఖరీ్ఫకు సంబంధించి 49 లక్షల మంది రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకున్నారు. అందులో పంటల బీమాకు 30.61 లక్షల మంది రైతుల ఈకేవైసీ అథంటికేషన్ పూర్తి చేసినా.. 15.60 లక్షల మంది రైతులకే పరిహారం దక్కింది. ఈ నెల 14న సీఎం జగన్ ‘బటన్’ నొక్కి నిధులు విడుదల చేశారు. వివిధ జిల్లాల్లో చాలా మంది రైతులు తమకు పంటల బీమా పరిహారం అందలేదని ఆందోళనకు దిగారు. ఆర్బీకేలకు తాళాలు వేసి మరీ నిరసనలు తెలిపారు. దీంతో పరిహారం అందని రైతులు మళ్లీ ఆర్బీకేల్లో వీఏఏ, వీహెచ్ఏల వద్ద వివరాలు నమోదు చేసుకోవటానికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు సీఎం, వ్యవసాయ మంత్రి, అధికారులు ప్రకటించారు.