106 కోట్లతో జోన్‌ ప్రధాన కార్యాలయం: కేంద్రం

ABN , First Publish Date - 2022-12-10T02:23:48+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా స్థాపిస్తున్న సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89కోట్లు గత నెల 10న మంజూరు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

106 కోట్లతో జోన్‌ ప్రధాన కార్యాలయం: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా స్థాపిస్తున్న సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు రూ.106.89కోట్లు గత నెల 10న మంజూరు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు భూమిని గుర్తించాం. భూ సర్వే, కార్యాలయం లేఅవుట్‌ ప్రణాళిక వంటి ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. జోన్‌ స్థాపన కోసం 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.40 లక్షల చొప్పున నిధులు కేటాయించాం’’ అని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-12-10T02:23:49+05:30 IST