రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేస్తున్నారు.. కేసీఆర్పై షర్మిల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-07-09T00:57:29+05:30 IST
రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేస్తున్నారు.. కేసీఆర్పై షర్మిల ఆగ్రహం

హైదరాబాద్: కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్కు ఇప్పుడే తెలివి వచ్చిందా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పక్క రాష్ట్రం సీఎంను పిలిపించుకుని భోజనం పెట్టినప్పుడు తెలియదా అని ఆమె వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి ఉమ్మడి శత్రువును ఓడించవచ్చని తెలిపారు. 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయితీని మాట్లాడుకోలేరా, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని షర్మిల ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి మీ లేదా అని ఆమె నిలదీశారు.
‘‘అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కదా?. రాష్ట్రాలుగా విడిపోయాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామనుకున్నాం. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలవరం వరకు కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని కూడా వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన నీటి బొట్టును అడ్డుకోం. ఇరుప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నది వైఎస్సార్ టీపీ సిద్ధాంతం. ఇక్కడ ఇంకా కాంగ్రెస్ ఉందంటే దానికి కారణం వైఎస్సార్. భారాన్ని తన భుజాన వేసుకుని 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు.’’ అని ఆమె గుర్తు చేశారు.
ఇంకా షర్మిల మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ పేరును పలికే అర్హత కూడా లేదు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నాయని పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నాడు. ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదు.. ఎందుకు కేసీఆర్ను జైల్లో పెట్టడం లేదు. ఇద్దరి మధ్య డీల్ కుదిరిందా?.. ఇద్దరూ తోడు దొంగలే. ఇక్కడ అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లేదా?. వైఎస్ గురించి చెడుగా మాట్లాడితే ఉరికించి కొడతారు.’’ అని హెచ్చరించారు.