భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ ఆధ్వర్యంలోయోగ డే వేడుకలు
ABN , First Publish Date - 2021-06-21T23:18:14+05:30 IST
భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఆధ్వర్యంలో తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో రెండు వారసత్వ ప్రదేశాల్లో సోమవారం 7వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
హైదరాబాద్: భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) ఆధ్వర్యంలో తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో రెండు వారసత్వ ప్రదేశాల్లో సోమవారం 7వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎఎస్ఐ ద్వారా కేంద్ర సాంస్కృతిక శాఖ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని పాలంపేట లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోటలో ఈ సందర్భంగా యోగ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాలంపేట రామప్ప ఆలయంలో యోగ గురువు కోడమ్ అశోక్, వరంగల్ కోటలో యోగ గురువు రవీంద్ర చారి యోగ విశిష్టతను వివరిస్తూ, పలు యోగాసనాలను ప్రదర్శించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా కపాలభీతి, ప్రాణాయామం, ధ్యానం వంటి యోగాసనాలను పరిచయం చేశారు. అనంతరం కళాకారులు కోలాటం, ఒగ్గుడోలు, బోనాలు వంటి మన సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు ప్రదర్శించారు.కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు ఉపయోగించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యమాలను నిర్వహించారు.