హోరాహోరీగా ‘చాంబర్‌’ పోరు

ABN , First Publish Date - 2021-08-25T05:30:00+05:30 IST

హోరాహోరీగా ‘చాంబర్‌’ పోరు

హోరాహోరీగా ‘చాంబర్‌’ పోరు

పది రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారం

బరిలో బొమ్మినేని రవిందర్‌రెడ్డి, సాదుల దామోదర్‌ ప్యానెళ్లు

గెలుపుపై ఎవరికి వారే ధీమా

రేపు చాంబర్‌ కార్యాలయంలో ఎన్నికలు


వరంగల్‌ టౌన్‌, ఆగస్టు 25: వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ ఎన్నికలు రస్తవత్తరంగా మారాయి. ఎన్నికలు శుక్రవారం జరగనుండటంతో అభ్యర్థులు ప్రచారంతో హరెత్తిస్తున్నారు. బరిలో బొమ్మినేని రవిందర్‌ రెడ్డి ఒక ప్యానెల్‌గా, సాదుల దామోదర్‌ మరో ప్యానెల్‌గా పోటీ పడుతున్నారు.  గత పది రోజులుగా ఈ రెండు ప్యానెళ్ల వారు  మార్కెట్లో  ప్రచారం నిర్వహిస్తూ అన్ని వర్గాల సభ్యులను కలుస్తున్నారు. సభ్యుల నివాసాలకు వెళ్లి తమను, తమ ప్యానెల్‌ సభ్యులను గెలిపించాలని కోరుతున్నారు. కులాల వారీ సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లను రాబట్టుకునేందుకు పాచికలు వేస్తున్నారు.  ప్రత్యర్థుల వైపల్యాలను ఎత్తి చూపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే చేసే పనులను సభ్యులకు వివరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులతో ముఖ్యమైన నాయకులపై ఒత్తిళ్లు పెంచి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి వర్గంలో కోవర్టులను పెట్టుకుని వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. గెలుపు తమదేనని ఇరుపక్షాల వారు ధీమాతో ఉన్నారు.  అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బొమ్మినేని రవిందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాటన్‌ అసోసియేషన్‌  అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా,  సాదుల దామోదర్‌ ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి భర్త కుమారస్వామికి సన్నిహితుడిగా పేరుపొందారు. ఇదిలావుండగా, ఈ సారి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చాంబర్‌ ఎన్నికల ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనడం లేదు. గతంలో ప్రజాప్రతినిధులు తమ తమ ప్యానెళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలికేవారు. కొన్నిసార్లు చాంబర్‌ పోరు రాజకీయ నాయకుల పోరుగా కనిపించేది. ప్రస్తుతం బరిలో ఉన్న సాదుల దామోదర్‌ ప్యానెల్‌కు చాంబర్‌ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నరేందర్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన దిడ్డి కుమారస్వామి మద్దతు తెలుపుతుండటం ఆసక్తికరంగా మారింది. 


1,089 మంది ఓటర్లు

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో 15 సెక్షన్లు 1,089 మంది సభ్యులు ఉన్నారు. అడ్తి సెక్షన్‌, కాటన్‌ సెక్షన్‌, చిల్లీస్‌ సెక్షన్‌, రైస్‌మిల్లు, పిల్వాని సెక్షన్‌, ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు సెక్షన్‌, కోల్డ్‌ స్టోరేజీ సెక్షన్‌, గ్రైండ్‌నట్‌, టర్మరిక్‌, ఆయిల్‌మిల్‌ సెక్షన్‌, కిరాణ సెక్షన్‌, అనాజ్‌ సెక్షన్‌, ఆయిల్‌ డీలర్స్‌ సెక్షన్‌, సాల్ట్‌ అండ్‌ జింజర్‌, అనియన్‌, పోటాటో సెక్షన్‌, బరాదాన్‌ సెక్షన్‌, ఫ్రూట్‌ సెక్షన్‌, విజిటేబుల్‌ సెక్షన్లు ఉన్నాయి. శుక్రవారం జరిగే ఎన్నికల్లోత 1089 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 


రేపే ఎన్నికలు 

వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయం భవనంలో శు క్రవారం ఎన్నికల అధికారి  చకిలం ఉపేందర్‌ ఆధ్వర్యంలో ఎ న్నికలు జరుగనున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సా యంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ర హస్య ఓటింగ్‌ పద్ధతిన ఒక్కో సభ్యుడు వెళ్లి ఓటేయాల్సి ఉంటుం ది. ఎన్నికల అనంతరం ఓట్లను ంచి విజేతలను ప్రకటిస్తారు. 


బొమ్మినేని రవిందర్‌ రెడ్డి ప్యానెల్‌ 

అధ్యక్షుడిగా బొమ్మినేని రవిందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మొగిలి చంద్రమౌళి, గౌరవ ప్రధాన కార్యదర్శిగా మడూరి వేదప్రకాష్‌, సంయుక్త కార్యదర్శిగా సాగర్ల శ్రీనివాస్‌, కోశాధికారిగా అల్లెసంపత్‌, కార్యవర్గ సభ్యులుగా కైలాస హరినాద్‌, గాజుల సుమన్‌, మేకల రవి, వెల్ది చక్రధర్‌, సూదాటి రాజేశ్వర్‌రావు పోటీ చేస్తున్నారు.


సాదుల దామోదర్‌ ప్యానెల్‌ 

అధ్యక్షుడిగా సాదుల దామోదర్‌, ఉపాధ్యక్షుడిగా కట్కూరి సత్యనారాయణ, గౌరవ ప్రధాన కార్యదర్శిగా తోట నర్సింహరావు, సంయుక్త కార్యదర్శిగా శ్రీరాం రవి, కోశాధికారిగా బండి జనార్ధన్‌, కార్యవర్గ సభ్యులుగా ఎనబోతుల రాజు, కంచ సంపత్‌, గౌరిశెట్టి శ్రీనివాస్‌, భారత రవిందర్‌, వొడానల రాజేందర్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. 


అడ్తిదారుల సమస్యలను పరిష్కరిస్తాం : బొమ్మినేని రవిందర్‌రెడ్డి, అఽధ్యక్ష అభ్యర్థి

మా ప్యానెల్‌ ఎవరి చేతిలోనూ కీలు బొమ్మ కాదు. చాంబర్‌ సభ్యులకే జవాబుదారీగా ఉంటాం.  అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులు, అవసరమైతే సీఎం వద్దకు వెళ్లి అయినా సమస్యలను పరిష్కరించగలుగుతాం. మా ప్యానెల్‌ సభ్యులకు ఏళ్లతరబడి వ్యాపారంలో, వివిధ సంస్థల్లో, సంఘాల్లో ప్రతినిధులుగా చేసిన అనుభవం ఉంది. కాటన్‌ అసోసియేషన్‌ రా ష్ట్ర అధ్యక్షుడిగా, చాంబర్‌ గౌరవ కార్యదర్శిగా పనిచేశాను. చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ గత పాలకవర్గం అన్ని విషయాల్లోనూ విఫలమైంది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను ఒక రియల్‌ ఎస్టేట్‌  వ్యాపారకేంద్రంగా మార్చారు.  రాజకీయ వేదికగా చేశారు.  మేం అధికారంలోకి వస్తే అడ్తిదారులకు సకాలంలో పద్దులు ఇప్పిస్తాం. స్పైసెస్‌ బోర్డు ద్వారా మిర్చి ల్యాబ్‌ ఏర్పాటు చేయిస్తాం. అడ్తి బకాయిల సమస్యను, వ్యాపారస్తుల, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. మార్కెట్‌ పక్కనే ఉన్న స్థలంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఆధునిక హంగులతో భవనం నిర్మిస్తాం. విజయం మాదే. 


చాంబర్‌ సభ్యుల శ్రేయస్సే ధ్యేయం : సాదుల దామోదర్‌, అఽధ్యక్ష అభ్యర్థి

అధికారంలో ఉన్నప్పుడు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతిష్ఠను రాజకీయ నాయకుల ఇంటి గేట్ల వద్ద తాకట్టు పెట్టినోళ్లకు ఇప్పుడు ఓట్లడిగే నైతిక హక్కు లేదు.  ది డ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో 25 యే ళ్లుగా వివిధ రూపాల్లో చాంబర్‌ సభ్యులకు సేలందిస్తున్నాం. అడ్తి లైసెన్సుల రెన్యూవల్‌ విషయంలో సేవలందించాం. నూతన లైసెన్సులకు ప్రభుత్వం రూ.5 లక్షలుగా నిర్ణయిస్తే  దానిని లక్ష రూపాయలకు కుదించాం. నగదు విడుదలకు 2శాతం చార్జీలు విధిస్తుంటే  అందరి సహకారంతో నిరోధించాం. జీఎ్‌సటీ, సిఫామ్‌ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాం. చాంబర్‌ ఆప్‌ కామర్స్‌ తీర్మానాలకు వ్యతిరేకంగా లైసెన్సులను రెన్యూవల్‌ చేసుకున్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను కాదని కాటన్‌ సెక్షన్‌ వారే బిల్డింగ్‌ కట్టుకున్నారు.  మా ప్యానెల్‌ సభ్యులు అపార అనుభవం ఉన్నవారు. మాకు ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు.  మాదే విజయం.

Updated Date - 2021-08-25T05:30:00+05:30 IST