Huzurabad ఉప ఎన్నికలు: ఈవీఎంలు మొరాయిస్తే పరిస్థితేంటి..? దేని ఆధారంగా ఓట్లను లెక్కిస్తారంటే..
ABN , First Publish Date - 2021-11-02T17:10:45+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే మూడు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. అయితే మూడో రౌండ్లో ఒక ఈవీఎం మొరాయించినట్టు వార్త వచ్చింది. అలాంటి సమయంలో ఏం చేస్తారు? కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే పరిస్థితేంటి?
ఏమిటీ వీవీ ప్యాట్
`ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయిల్`కు సంక్షిప్త రూపమే వీవీప్యాట్. ఇది ఒక చిన్న ప్రింటిర్ లాంటిది. దీనిని ఈవీఎంకు అనుసంధానిస్తారు. దీని ద్వారా తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లు చూసుకోవచ్చు. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓటరు ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు ప్రింట్ అయిన స్లిప్ సీల్డ్ బాక్స్లో పడుతుంది. 2013లో నాగాలాండ్లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూత్లలో వీవీప్యాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.
ఓటింగ్లో పారదర్శకతో కోసమే వీవీ ప్యాట్ను ఏర్పాటు చేసినా.. ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. అలా కూడా సాధ్యం కాకపోతే వీవీ ప్యాట్ స్లిప్ల ద్వారా ఫలితాన్ని తెలుసుకోవచ్చు.