నిబంధనలు ఉల్లఘించి.. భారతి సిమెంట్స్కు సాయం
ABN , First Publish Date - 2021-12-31T08:49:15+05:30 IST
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.కృపానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వైఎస్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది.

కాలయాపనకే కృపానందం పిటిషన్: సీబీఐ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.కృపానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వైఎస్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. శాఖాధిపతిగా చర్యలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నా, కృపానందమే చట్ట వ్యతిరేకంగా చేశారని సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ హైకోర్టు కు నివేదించారు. జగన్ అక్రమాస్తులకు సంబంధించి.. భారతి సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కృపానందం దాఖలు చేసి న పిటిషన్పై గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధ ర్మాసనం విచారణ జరిపింది. చార్జిసీటును సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడం కాలయాపన చేసేందుకేనని తెలిపారు. ఆయన పదవీ విరమణ చేశారని, అందుచేత కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమే ఉండదని వివరించారు.