తగ్గిన కూరగాయల ధరలతో ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు
ABN , First Publish Date - 2021-03-17T21:09:43+05:30 IST
కూరగాయల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
హైదరాబాద్: కూరగాయల ధరలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండువారాల క్రితం ఉన్నధరలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ధరలు బాగా తగ్గాయి. దీనికి కారణంగా తెలంగాణలో ఈసారి భారీగా కూరగాయల ఉత్పత్తులు పెరగడమేనని మార్కెటింగ్శాఖ అధికారులు తెలిపారు. అలాగే పక్క రాష్ర్టాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్నగరానికి కూరగాయల దిగుమతి బాగా పెరిగింది. నగరంలోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లైన గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బి నగర్, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు రైతు బజార్లకు రోజూ భారీగానే కూరగాయల దిగుమతి జరుగుతోంది.
ధరల విషయానికి వస్తే ప్రస్తుతం టమాటా ధరలు రిటైల్ మార్కెట్లో కిలోకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు పలుకుతోంది. అలాగే చిక్కుడు కాయ 20రూపాయలు, బుడమకాయ 10 రూపాయలు, గోకరకాయ కిలో 20 నుంచి 30 రూపాయలు పలుకుతోంది. బెండకాయ 20, వంకాయ 20 రూపాయలు, కాలిఫ్లవర్ ఒకటికి 10 నుంచి 15 రూపాయలు, క్యాబేజీ కిలో 10 నుంచి 20రూపాయలు, క్యాప్సికం 20 నుంచి 30 రూపాయలు, క్యారట్ 20 రూపాయలు, ఉల్లిగడ్డ కిలో 20 నుంచి 25 రూపాయలు, ఆలుగడ్డ కిలో 20 రూపాయలు పలుకుతోంది. గత కొన్నిరోజుల క్రితం బర్డ్ఫ్లూ పేరుతో చికెన్ కొనుగోళ్లుతగ్గడంతో చాలా మంది కూరగాయల వైపు మొగ్గుచూపారు. దీంతోవ్యాపారులు ధరలు పెంచి అమ్మారు. కానీ ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.