కేటీఆర్‌, రాకేశ్‌రెడ్డి మధ్య ట్విట్టర్‌ వార్‌

ABN , First Publish Date - 2021-02-07T04:03:54+05:30 IST

నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మాటల యుద్ధం..

కేటీఆర్‌, రాకేశ్‌రెడ్డి మధ్య ట్విట్టర్‌ వార్‌
కేటీఆర్‌, రాకేశ్‌రెడ్డిలు చేసిన ట్వీట్‌లు

స్మార్ట్‌సిటీపై ట్వీట్‌.. రీట్వీట్‌

ఆసక్తిగా గమనిస్తున్న నెటిజన్లు


హన్మకొండ(ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మాటల యుద్ధం సాగించారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వరంగల్‌లో ఇటీవల కొత్తగా కాజీపేట నుంచి సుబేదారి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేసినందుకు నగర పాలక సంస్థ అధికారులను ప్రశంసిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్టు చేశారు. దీనిపై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మరో వీడియోను విడుదల  చేశారు. ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌ వార్‌ ఆసక్తికరంగా సాగింది. 


వాహ్‌! సైక్లింగ్‌ ట్రాక్‌..

మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో స్మార్ట్‌సిటీ గురించి ఇలా రాసుకొచ్చారు. ‘జీడబ్ల్యుఎంసీ అభివృద్ధి చేసిన అందమైన సైక్లింగ్‌ దారులు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. జీడబ్ల్యుఎంసీ బృందానికి నా అభినందనలు.’ హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాలు, నగరాల్లోనూ మనకు ఇటువంటివి ఏర్పాటు చేయాల్సిన  అవసరం ఉంది’ అంటూ రాసుకొచ్చారు.



అయ్యో! బస్టాండ్‌..

దీనికి ప్రతిస్పందనగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి కేటీఆర్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ... ‘కేటీఆర్‌ గారు.. స్మార్ట్‌సిటీ నిధులను మళ్లించడానికి మీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటితో సంబంధం లేకుండా వరంగల్‌కు నిరంతరం మద్దతు ఇచ్చినందుకు మోదీజీకి, బీజేపీ ప్రభుత్వానికి మీరు, మీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలపడం మరిచిపోకండి’ అని... రీట్వీట్‌ చేశారు. వరంగల్‌ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని అన్నారు. ఉదాహరణకు.. ఒకేచోట రోడ్డుకు ఇరువైపులా ఉన్న బస్టాండ్‌, రైల్వేస్టేషన్లను పరిశీలిస్తే రైల్వేస్టేషన్‌ రూపురేఖలు అద్భుతంగా, అభివృద్ధికి నమూనాగా కనిపిస్తోంది. కానీ దానికి ఎదురుగా ఉన్న వరంగల్‌ బస్టాండ్‌ మాత్రం పెచ్చులూడిపోయి కనీసం కన్నెత్తి చూసే నాథుడే లేక పాడుబడిన బంగ్లాలా ప్రమాదకరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఒక న్యూస్‌చానెల్‌ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. 


మరీ!  బడ్జెట్‌లో నిధులో?..

రాకేష్‌ రెడ్డి ట్వీట్‌కు వెంటనే టీఆర్‌ఎస్‌ నాయకులు స్పందిస్తూ.. ‘రాకేశ్‌రెడ్డి గారు.. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని, దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే రాకేశ్‌రెడ్డి... స్మార్ట్‌సిటీ పథకం కింద వరంగల్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మీకు నిజంగా అభివృద్ధి చేయాలని ఉంటే స్మార్ట్‌ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ట్విట్టర్‌ వేదికగా ఐటీ మంత్రి, కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి మధ్య ట్వీట్లను ఆసక్తిగా గమనిస్తున్న నెటిజన్లు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-02-07T04:03:54+05:30 IST