నీటి పంపకాలపై ట్రైబ్యునల్ వేయండి
ABN , First Publish Date - 2021-06-17T08:19:19+05:30 IST
సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉపసంహరణ కోసం పిటిషన్ వేశామని, నీటి పంపకాలకు సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
- తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలంటే వేయాల్సిందే
- జల వివాద చట్టం అనుమతిస్తుంది.. కేంద్రానికి రాష్ట్రం లేఖ
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉపసంహరణ కోసం పిటిషన్ వేశామని, నీటి పంపకాలకు సంబంధించి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి సరైన నీటి వాటా దక్కాలంటే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ను ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ ట్రైబ్యునల్కు అనేక పరిమితులు ఉన్నాయని, ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి కోటాలో మార్పులు చేయడానికి వీలు లేకుండా ఉందని తెలంగాణ సర్కారు వాదిస్తోంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని కోరుతోంది. గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తాము నిర్ణయం తీసుకోలేమని అపెక్స్ కౌన్సిల్కు అధ్యక్షత వహించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. కేసును ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ కేంద్రానికి తాజాగా రజత్కుమార్ లేఖ రాశారు. ఉపసంహరణ పిటిషన్ను దాఖలు చేసినందున ట్రైబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.