‘లాకోయీ’ అనుకోని అతిథి!
ABN , First Publish Date - 2021-05-21T08:59:09+05:30 IST
మోహన్-సంధ్య దంపతులు. కూకట్పల్లి ప్రగతినగర్లో ఉంటారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉంటున్న బందువులకు ఆరోగ్యం బాగోలేకపోతే లాక్డౌన్కు ముందు

ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన జనాలు
మినహాయింపు టైమ్ను ఉపయోగించుకోవాలి: పోలీసులు
హైదరాబాద్ సిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): మోహన్-సంధ్య దంపతులు. కూకట్పల్లి ప్రగతినగర్లో ఉంటారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉంటున్న బందువులకు ఆరోగ్యం బాగోలేకపోతే లాక్డౌన్కు ముందు చూసేందుకని అక్కడికి వెళ్లారు. వెళ్లిన రెండ్రోజులకే దంపతులకు కరోనా అంటుకుంది. దాంతో అక్కడే బంధువల ఇంట్లోని గదిలో హోం క్వారంటైన్ అయ్యారు. పూర్తిగా కోలుకున్నారు. ఇంతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దాంతో వాళ్లు తిరిగి తెలంగాణకు రావడానికి పాస్కోసం ఏపీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వెళ్లడానికి అనుమతివ్వడం కుదరదని పాస్ తిరస్కరించారు. సరేలే లాక్డౌన్ కేవలం పదిరోజులే కదా అని వారు సరిపెట్టుకున్నారు. అయితే లాక్డన్ను ఈనెల దాకా పొడిగించడంతో రాష్ట్రానికి తిరిగిరాలేక బంధువుల ఇంట్లో రోజుల తరబడి ఉండలేక ఆ దంపతులు సతమతమవుతున్నారు. ఈ దంపతులకు మల్లే వందల మంది కష్టాలు పడుతున్నారు.
లాక్డౌన్కు ముందు ఇరు రాష్ట్రాలకు వెళ్లి లాక్డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఉదయం 6గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ నాలుగు గంటల సమయంలో ప్రయాణించవచ్చునని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలోని పలు జిల్లాల నుంచి తెలంగాణకు రావాలనుకున్న వారు సమయం సరిపోక సరిహద్దుల్లో ఇరుక్కుంటున్నారు. వారికి ఎలాంటి అనుమతి పాస్లు లేకపోవడంతో పోలీసులు రానివ్వడంలేదు.
ఆ సమయాన్నే ఉపయోగించుకోవాలి
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వం కల్పించిన లాక్డౌన్ నుంచి మినహాయింపు సమయాన్ని సధ్వినియోగం చేసుకోవాలని, ఆ సమయంలోనే గమ్యస్థానం చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కుదరని పక్షంలో రైలు మార్గాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ముందుగా బుక్చేసుకున్న టిక్కెట్ను చూపిస్తే స్టేషన్కు అనుమతిస్తారని, ఎలాగూ రైల్ టిక్కెట్ ఉంటుంది కాబట్టి రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు. లాక్డౌన్ అనేది కరోనాను కట్టడి చేయడానికి మాత్రమేనని, ప్రజలను కష్టపెట్టడానికి కాదనిచెబుతున్నారు.