టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. మా వద్ద ఎలాంటి ఆధారాల్లేవ్‌

ABN , First Publish Date - 2021-09-17T09:12:53+05:30 IST

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తమ ఆధీనంలో ఎలాంటి ఆధారాలు లేవని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ హైకోర్టుకు తెలిపింది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. మా వద్ద ఎలాంటి ఆధారాల్లేవ్‌

ట్రయల్‌ కోర్టు వద్దే ఉన్నాయి.. హైకోర్టుకు వెల్లడించిన ఎక్సైజ్‌శాఖ


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తమ ఆధీనంలో ఎలాంటి ఆధారాలు లేవని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. డ్రగ్స్‌ సరఫరా కేసును కేంద్ర సంస్థలకు అప్పగించాలని, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ ఏకపక్షంగా దర్యాప్తును కొనసాగిస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ, సిట్‌, సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) వంటి సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన 12కేసుల వివరాలు తమకు సమర్పించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఇదే పిటిషన్‌లో ఈడీ అప్లికేషన్‌ దాఖలు చేసింది. ఈడీ కోరిన వివరాలు తమ వద్ద లేవంటూ తాజాగా ఎక్సైజ్‌శాఖ బుధవారం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించి 12కేసులు నమోదు చేసినట్లు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తై, ట్రయల్‌ కోర్టుల్లో చార్జిషీట్లను దాఖలు చేశామని తెలిపారు. డిజిటల్‌ ఎవిడెన్స్‌లు, రికార్డెడ్‌ స్టేట్‌మెంట్లు, ఇతర ఆధారాలను ట్రయల్‌ కోర్టుల్లో సమర్పించినట్లు వివరించారు. 

Updated Date - 2021-09-17T09:12:53+05:30 IST