మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో బెదిరింపులు
ABN , First Publish Date - 2021-11-26T09:58:52+05:30 IST
మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో ఠాకూర్ రాజ్కుమార్ సింగ్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గిరిజనులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

హెచ్ఆర్సీని ఆశ్రయించిన గిరిజనులు
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో ఠాకూర్ రాజ్కుమార్ సింగ్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గిరిజనులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల పరిరక్షణ ట్రస్ట్, వినియోగదారుల హక్కుల రక్షణ విభాగ చైర్మన్గా తనను తాను ప్రచారం చేసుకుంటూ ఠాకూర్ రాజ్కుమార్ గిరిజనులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మం డలంలోని అయిలాపూర్ తండాలో గిరిజనులను తన చేష్టలతో ఠాకూర్ రాజ్కుమార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమిషన్కు వివరించారు. గిరిజనుల భూములను ప్రభుత్వ భూములని చెబుతూ మానవ హక్కుల ట్రస్ట్ చైర్మన్ పేరుతో ఆయన తమకు లేఖలు రాసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై గతంలో తాము హెచ్ఆర్సీలో ఫిర్యాదుపై చేశామని చెప్పారు. అయితే, ఈ నెల 18న హెచ్ఆర్సీ తనను విచారించి, క్లీన్ చిట్ ఇచ్చిందంటూ రాజ్కుమార్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని గిరిజనులు చెప్పారు. ఈ నేపథ్యంలో తాము గురువారం మరోసారి హెచ్ఆర్సీని ఆశ్రయించామయని తెలిపారు.