బ్లాక్‌ ఫంగస్‌కు అవి కారణాలు కావు

ABN , First Publish Date - 2021-06-21T09:53:08+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ సమస్య రావడానికి ప్రధాన కారణాలు.. మధుమేహం, కొవిడ్‌ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ అధికంగా వాడడం అనే అభిప్రాయం ఇన్నాళ్లుగా ఉంది.

బ్లాక్‌ ఫంగస్‌కు అవి కారణాలు కావు

  • షుగర్‌, స్టెరాయిడ్స్‌తో  సంబంధం లేదు
  • 26 శాతం బాధితులకు మధుమేహం లేదు
  • బాధితుల్లో మధ్యవయస్కులే ఎక్కువ
  • 1162 మంది రోగులపై వైద్య శాఖ అధ్యయనం


హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): బ్లాక్‌ ఫంగస్‌ సమస్య రావడానికి ప్రధాన కారణాలు.. మధుమేహం, కొవిడ్‌ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ అధికంగా వాడడం అనే అభిప్రాయం ఇన్నాళ్లుగా ఉంది. కానీ.. కొద్దిమందికి మాత్రమే అలా కొవిడ్‌ చికిత్స వల్ల సోకుతోందని, బాధితుల్లో చాలా మందికి మధుమేహం లేదని, స్టెరాయిడ్స్‌ వాడలేదని.. వైద్య, ఆరోగ్య శాఖ తాజా అధ్యయనంలో తేలినట్టు అధికారులు తెలిపారు. సెకండ్‌వేవ్‌లో కొవిడ్‌ కేసులతోపాటు మ్యూకర్‌మైకోసిస్‌ కేసులు కూడా ప్రజలను బాగా భయపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మొత్తం 1162 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులపై అధ్యయనం చేసింది. వారిలో 303 మందికి.. అంటే 26 శాతం మందికి అసలు మధుమేహమే లేదని అందులో తేలింది. అలాగే మరో 27 శాతం మంది ఎటువంటి స్టెరాయిడ్స్‌ వాడలేదని వెల్లడైంది. కరోనా వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడంతోనే వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకి ఉంటుందని వైద్య శాఖ ఒక అంచనాకు వచ్చింది. దీంతో పాటు అసలు కరోనానే రాని మరో 11 మందికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 1162 మంది బాధితుల్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఏడుగురున్నారు. వారెవరికీ కరోనా సోకలేదు. మధ్యవయసువారికి ఈ సమస్య ఎక్కువగా వచ్చినట్టు తేలింది. వీటన్నింటి నేపథ్యంలో.. మ్యూకర్‌మైకోసిస్‌ రావడానికి షుగర్‌, స్టెరాయిడ్స్‌ ప్రధాన కారణాలు కావనే అంచనాకు వైద్యనిపుణులు వచ్చారు.


కొనసాగుతున్న కేసులు..

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గినప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజుకు పదుల సంఖ్యలో వస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు.. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో రెండు రోజుల్లో 31 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు చేరారు. ఈఎన్‌టీలో ప్రస్తుతం 150 మందికి చిక్సిత అందిస్తున్నారు. గాంధీలో సుమారు ఐదొందల మంది అడ్మిట్‌ అవ్వగా.. 150 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 320 మంది రోగులకు ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు, నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 2500 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు అయ్యాయి.





Updated Date - 2021-06-21T09:53:08+05:30 IST