జైల్లో ఫ్యామిలీ.. ఇంట్లో దొంగలు!
ABN , First Publish Date - 2021-02-08T09:25:32+05:30 IST
జైల్లో ఫ్యామిలీ.. ఇంట్లో దొంగలు!
![జైల్లో ఫ్యామిలీ.. ఇంట్లో దొంగలు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బంగారు నగలు, ఇతర వస్తువులు చోరీ
జవహర్నగర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఓ కేసు నమోదు కావడంతో కుటుంబమంతా జైల్లో ఉంది. ఇదే అదనుగా దొంగలు తాళాలు బద్దలు కొట్టేసి వారి ఇల్లంతా గుల్ల చేశారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్, జ్యోతి కాలనీలో నివాసం ఉండే దీపిక గత నెల 29న మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడంతో వారందరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీపిక ఇంటి తాళాలు పోలీసులవద్ద ఉన్నాయి. గేటుకు సంబంధించిన తాళం చెవులు ఎదురింట్లో పెడితే దీపిక బంధువైన మనోహర్సాగర్ రోజూ వచ్చి గేటు తాళం తీసి ఆ పరిసరాలను శుభ్రం చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం మనోహర్ వచ్చే సరికి ఇంటి ప్రధాన ద్వారం గ్రిల్ తొలగించి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులొచ్చి ఇంటి తాళాలు తీసి చూసేసరికి సామాన్లన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. ఇంట్లోవారికి సంబంధించిన బంగారు నగలతోపాటు పలు విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులకు మనోహర్ ఫిర్యాదు చేశారు.