రైతు ఉద్యమం దేశానికే స్ఫూర్తి
ABN , First Publish Date - 2021-01-27T08:55:13+05:30 IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని డైలాగ్ సంస్థ ప్రతినిధి స్వేచ్ఛా జ్యోతి అన్నారు. ఈ ఉద్యమం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు.
రైతులు కార్పొరేట్ శక్తులతోనూ పోరాడుతున్నారు
ఢిల్లీ ర్యాలీలో డైలాగ్ సంస్థ ప్రతినిధి స్వేచ్ఛా జ్యోతి
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని డైలాగ్ సంస్థ ప్రతినిధి స్వేచ్ఛా జ్యోతి అన్నారు. ఈ ఉద్యమం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. మంగళవారం ఢిల్లీలో రైతుల ర్యాలీకి మద్దతుగా పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు తెలంగాణ నుంచి కూడా పలువురు ఉద్యమకారులు వెళ్లారు. సింఘా సరిహద్దులో ఏర్పాటు చేసిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ వేదిక నుంచి స్వేచ్ఛాజ్యోతి ప్రసంగించారు. రైతులు కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పోరాడటంలేదని, కార్పొరేట్ శక్తులతో కూడా తలపడుతున్నారని తెలిపారు. రైతు లేకుండా సమాజమే లేదని, అలాంటిది రైతుల ఉనికికే ప్రశ్నార్థకం చేసే ఈ చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులే లాభపడతాయని పేర్కొన్నారు. రైతు ఉద్యమం నుంచి దేశంలోని ప్రజాస్వామిక శక్తులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో రైతు ఉద్యమం మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్వేచ్ఛాజ్యోతి ప్రకటించారు.