వ్యాక్సిన్ తీసుకున్న మహిళా సర్పంచ్ మృతి
ABN , First Publish Date - 2021-04-16T09:18:56+05:30 IST
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మూడో రోజే మహిళా సర్పంచ్ ఆకస్మికంగా మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధన సర్పంచ్ రాజమోని మయూరి(31).. కేశంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ నెల 12న కరోనా టీకా
కేశంపేట, ఏప్రిల్ 15: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మూడో రోజే మహిళా సర్పంచ్ ఆకస్మికంగా మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం లింగంధన సర్పంచ్ రాజమోని మయూరి(31).. కేశంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ నెల 12న కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండగా, గురువారం తెల్లవారుజామున ఒక్క సారిగా పల్స్ పడిపోయాయి. చికిత్సనిమిత్తం ఆమెను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, కొవిడ్ టీకా వల్లే సర్పంచ్ మయూరి మృతి చెందారంటూ గ్రామస్థులు, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యాధికారులను ఘెరావ్ చేశారు. ఇదిలా ఉండగా, ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు 45 ఏళ్లు దాటిన వారికే కొవిడ్ టీకా వేయాలని నిబంధనలు ఉండగా, 31 ఏళ్ల వయస్సున్న సర్పంచ్కు టీకా వేయడం చర్చనీయాంశంగా మారింది. ‘‘కేశంపేట పీహెచ్సీలో ఈనెల 12న 170మందికి టీకా వేశాం. ఎవరికీ సమస్య తలెత్తలేదు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మృతి చెందే అవకాశమే లేదు. 45 ఏళ్లు నిండాయంటూ ఆమె స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వల్లే టీకా వేశాం’’ అని డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.