ఆందోళనతో టీచర్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-31T08:32:51+05:30 IST

ఉపాధ్యాయ దంపతుల బదిలీల కౌన్సెలింగ్‌ ఆలస్యం అవుతుండడంతో ఆందోళన చెందుతోన్న బానోత్‌ జేత్‌రాం (57) అనే టీచర్‌ గురువారం గుండెపోటుతో మృతిచెందారు.

ఆందోళనతో టీచర్‌ మృతి

దంపతుల కౌన్సెలింగ్‌ ఆలస్యం వల్లే

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 30: ఉపాధ్యాయ దంపతుల బదిలీల కౌన్సెలింగ్‌ ఆలస్యం అవుతుండడంతో ఆందోళన చెందుతోన్న బానోత్‌ జేత్‌రాం (57) అనే టీచర్‌ గురువారం గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేత్‌రాం.. నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. జేత్‌రాంను ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో మానుకోట జిల్లా నుంచి ములుగు జిల్లాకు కేటాయించారు. అయితే, రిపోర్టు చేసిన నాటి నుంచి ఆయన ఆందోళన చెందుతున్నారు. ఆయన భార్య జ్యోతి మహబూబాబాద్‌లోనే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.


ఉపాధ్యాయ దంపతుల బదిలీల కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో మనోవేదనకు గురైన జేత్‌రాం ఇంటివద్దనే గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా, ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజనలో ప్రభుత్వం అనుసరిస్తోన్న అనాలోచిత విధానాల వల్లే జైత్‌రామ్‌ మృతి చెందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జేత్‌రాం మృతి ప్రభుత్వ హత్యేనని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి ఆరోపించారు. 


నేడు గవర్నర్‌తో బండి సంజయ్‌ భేటీ

ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సమీక్షించాలని కోరడానికి గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనుంది. ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ను కలిసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎదురవుతున్న సమస్యలను వివరించనుంది.

Updated Date - 2021-12-31T08:32:51+05:30 IST