ఇతరులకు భారమవ్వొద్దని.. చావే ముద్దని!

ABN , First Publish Date - 2021-04-11T07:37:16+05:30 IST

ఆ వద్ధ దంపతులకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు.

ఇతరులకు భారమవ్వొద్దని.. చావే ముద్దని!

  • ఉరి వేసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య 
  • అనారోగ్య సమస్యలతోనే..
  • ముగ్గురు కొడుకులున్నా వేధించిన ఒంటరితనం

అశ్వారావుపేట/దమ్మపేట, ఏప్రిల్‌ 10: ఆ వద్ధ దంపతులకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. అయితే ఎవ్వరికీ భారం కావొద్దన్న ఆత్మాభిమానంతో 20 ఏళ్లుగా వేరుగా ఉంటున్న వారికి ఇటీవల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. రానురాను ఒంటరితనం భరించడమూ కష్టమైంది. ఈ పరిస్థితుల్లో జీవితంపై విరక్తి చెంది ఆ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెంలో శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దూబగుంట్ల నాగభూషణం(75), ఆదిలక్ష్మి(70)లకు నలుగురు మగ సంతానం. వీరిలో ఒకరు గతంలోనే మృతి చెందగా మిగిలిన ముగ్గురిలో శ్రీనివాసరావు, భాస్కరరావు పట్వారిగూడెంలో ఉంటుండగా రామభద్రం సత్తుపల్లిలో ఉంటున్నాడు. 


ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్న నాగభూషణం 20ఏళ్ల క్రితమే కుమారులకు ఆస్తులు పంచి ఇచ్చాడు. మొదటినుంచి స్వతంత్రంగా బతకాలని కోరుకునే ఆయన, తన వద్ద కొంత ఆస్తి ఉంచుకొని పట్వారిగూడెంలోనే భార్య ఆదిలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఈ దంపతులు ఏడెనిమిదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం నాగభూషనం తీవ్ర అస్వస్థతకు గురవడంతో విజయవాడ ఆస్పత్రిలో నెలపాటు చికిత్స పొందాడు. కోలుకొని ఇంటికి వచ్చినా అనారోగ్య సమస్యలు వెంటాడటం, పిల్లలకు దూరంగా ఒంటరిగా ఉండటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అనారోగ్యంతో తమ పనులను తాము చేసుకోవడానికి శరీరం పూర్తిగా సహకరించే పరిస్ధితి లేకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు.  

Updated Date - 2021-04-11T07:37:16+05:30 IST