ఆర్టీసీకి ఒక్క రోజులో రూ. 14.79 కోట్లు
ABN , First Publish Date - 2021-10-20T08:08:03+05:30 IST
ఆర్టీసీకి ఒక్క రోజులో రూ. 14.79 కోట్లు

యూపీఐ, క్యూఆర్కోడ్ చెల్లింపులు
హైదరాబాద్, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ అనంతరం ఆర్టీసీ సోమవారం అత్యధికంగా రూ. 14.79కోట్ల ఆదాయాన్ని సాధించింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అక్టోబరు 8నుంచి 14 వరకు వారం రోజుల పాటు 2736 ప్రత్యేక బస్సులు నడిపారు. ఈ సమయంలో రోజుకు 13 కోట్ల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. వారి అంచనా మేరకు ఆదాయం సమకూరలేదు. అక్టోబరు 8న రూ.10.33కోట్లు, 9న రూ. 10.46 కోట్లు, 10న 9.08 కోట్లు, 11న రూ.11.78 కోట్లు, 12న రూ.11.03 కోట్లు, 13న రూ. 10.42కోట్లు, 14న 9.93 కోట్లు, 15న రూ.5.74 కోట్లు, 16న రూ.7.43 కోట్లు, 17న రూ. 10.21 కోట్లు ఆదాయం లభించింది. ప్రత్యేక బస్సులు నడిపిన సమయంలో కంటే ఎక్కువగా 18వ తేదీ సోమవారం ఒక్కరోజే రూ. 14.79 కోట్ల ఆదాయం లభించింది. అత్యధిక ఆదాయాన్ని సాదించేందుకు కృషి చేసిన ఉద్యోగులను, అధికారులను ఎండీ సజ్జనార్ అభినందించారు. ప్రయాణికులు ఆర్టీసీకి మద్దతు ఇలాగే కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, టీఎ్సఆర్టీసీ యూపీఐ, క్యూఆర్కోడ్ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైతిఫైల్ బస్స్టేషన్లో ప్రారంభించామని తెలిపారు. టికెట్ రిజర్వేషన్, పార్సిల్ సర్వీస్, కార్గో సెంటర్, బస్పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానాన్ని దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.