చదువుకు వేళాయె

ABN , First Publish Date - 2021-01-12T07:57:53+05:30 IST

కరోనా కారణంగా మూతబడ్డ విద్యాసంస్థలు 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి

చదువుకు వేళాయె

విద్యా సంస్థల పునఃప్రారంభం 

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు

9వ తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, 

ప్రొఫెషనల్‌ కోర్సుల క్లాసుల ప్రారంభం

25లోగా బడులన్నింటినీ శానిటైజ్‌ చేయాలి

హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు రెడీ చేయాలి


హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా మూతబడ్డ విద్యాసంస్థలు 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సుల వరకూ తరగతులు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తివిద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలన్నారు. ఈ లోగా అన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను సిద్ధం చేయాలన్నారు. అవన్నీ పరిశుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లోని సామగ్రినంతటినీ శానిటైజ్‌ చేయాలని ఆదేశించారు.


మూసివేతకు ముందు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామగ్రి పురుగు పట్టే అవకాశం ఉన్నందున.. స్టాకును సరిచూసుకోవాలన్నారు. మొత్తంగా తరగతుల నిర్వహణకు అనుగుణంగా ఈ నెల 25 లోగానే విద్యాసంస్థలను సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక అన్ని శాఖల్లో ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఖాళీలను కూడా ఏకకాలంలో భర్తీ చేయాలని నిర్దేశించారు. దీనికోసం ఖాళీలను గుర్తించే ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. 


1 నుంచి గురుకుల పాఠశాలలు: కొప్పుల 

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గురుకుల విద్యాసంస్థలు పునః ప్రారంభమవుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. తరగతుల నిర్వహణ సమయంలో కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని, విద్యార్థులు/ఉపాధ్యాయులు/ఉద్యోగుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే పాఠశాలలు తెరవాలని సూచించారు. ఎస్సీ, మైనారిటీ గురుకులాల్లో 9వ, ఆ పై తరగతుల విద్యార్థులు హాజరు కావాలని అన్నారు. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులు, విభాగాధిపతులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 

Updated Date - 2021-01-12T07:57:53+05:30 IST