వెంటనే అఖిలపక్షం పెట్టండి: చాడ వెంకటరెడ్డి
ABN , First Publish Date - 2021-11-09T08:06:01+05:30 IST
ప్రభుత్వం పోడుభూముల సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
![వెంటనే అఖిలపక్షం పెట్టండి: చాడ వెంకటరెడ్డి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, కవాడిగూడ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పోడుభూముల సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇచ్చేవరకు మరో పోరాటం చేస్తామని ప్రకటించారు. పోడు దరఖాస్తుల స్వీకరణకు చట్టం ప్రకారం కనీసం మూడు నెలలపాటు గడువు ఇవ్వాలని, గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, హక్కుల గుర్తింపు జరగాల ని, అటవీశాఖ జోక్యాన్ని నియంత్రించాలని అన్నారు. పోడు భూముల సమస్యలపై సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పోడు భూముల స మస్యల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పోడు భూములకు హక్కులు కల్పించే విషయంలో అఽధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజకీయ జోక్యం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అడవులను రక్షించాల ని మాట్లాడుతున్న ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు అనుమతి ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ చట్టం ప్రకారం గ్రామ సభలు ఏర్పాటు చేయాలని, నిజమైన పోడు సాగు దారులందరినీ గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సభ అధికారాలను హరించే విధంగా చట్టం అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.