తలసరి విద్యుత్ వినియోగం... దక్షిణాదిలో తెలంగాణ టాప్
ABN , First Publish Date - 2021-02-06T09:59:59+05:30 IST
తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం జోరుగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ 2,071 యూనిట్లతో టాప్1లో ఉండగా..

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం జోరుగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ 2,071 యూనిట్లతో టాప్1లో ఉండగా.. జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మూడేళ్లకు సంబంధించిన గణాంకాలను వెలువరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15,517 యూనిట్లతో దాద్రానగర్ హవేలీ అగ్రస్థానంలో ఉండగా...తర్వాతి స్థానాల్లో వరుసగా 7,561 యూనిట్లతో డామన్డయ్యూ, 2,396 యూనిట్లతో గోవా, 2,388 యూనిట్లతో గుజరాత్, 2,229 యూనిట్లతో హరియాణా, 2,171 యూనిట్లతో పంజాబ్, 2,071 యూనిట్లతో తెలంగాణ (ఏడో స్థానం) ఉన్నాయి. ఏపీ 1,507 యూనిట్లతో దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుగా ఉంది. తెలంగాణలో 2017-18లో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లు ఉండగా... 2018-19లో 1,896 యూనిట్లు, 2019-20లో 2,071 యూనిట్లకు చేరింది. వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎత్తిపోతల పథకాల పంపింగ్ వంటి కారణాలు తలసరి విద్యుత్ వినియోగం పెరగడంలో కీలక పాత్ర పోషించాయి.