ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి
ABN , First Publish Date - 2021-11-16T23:26:21+05:30 IST
ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా తెలంగాణలోని పోచంపల్లిని ప్రపంచ పర్యాటక సంస్ధ గుర్తించింది. దీంతో తెలంగాణ రాష్టానికి మరో గౌరవం దక్కినట్టయ్యింది.
హైదరాబాద్: ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా తెలంగాణలోని పోచంపల్లిని ప్రపంచ పర్యాటక సంస్ధ గుర్తించింది. దీంతో తెలంగాణ రాష్టానికి మరో గౌరవం దక్కినట్టయ్యింది. చేనేత పనితనానికి ప్రసిద్ధి పొందిన పోచం పల్లికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. తాజాగా ప్రపంచ పర్యాటక సంస్ధ ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తించడంతో మరింతగా ప్రాచుర్యంలోకి రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా తాజాగా పోచం పల్లి కూడా చేరిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోచం పల్లి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా వుందని ఆయన అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్టయ్యింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ. భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.దీంతో ఈ గ్రామానికి పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం వుంది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్లోని మాడ్రిడ్లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా పేరు వచ్చింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.