ఏపీలో కొత్తగా పార్టీ ఎందుకు!?

ABN , First Publish Date - 2021-10-29T08:44:55+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పార్టీ ఎందుకు? అంతర్జాతీయ టీఆర్‌ఎస్‌, జాతీయ టీఆర్‌ఎస్‌, ఏపీ టీఆర్‌ఎస్‌, తెలంగాణ టీఆర్‌ఎస్‌ అని ఎందుకు? అదే టీఆర్‌ఎస్‌ పార్టీని ఉంచొచ్చు కదా? అసలు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరి.

ఏపీలో కొత్తగా పార్టీ ఎందుకు!?

  • రెండు రాష్ట్రాలనూ కలిపేస్తే టీఆరెస్సే ఉండొచ్చు
  • ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పార్టీ ఎందుకు? అంతర్జాతీయ టీఆర్‌ఎస్‌, జాతీయ టీఆర్‌ఎస్‌, ఏపీ టీఆర్‌ఎస్‌, తెలంగాణ టీఆర్‌ఎస్‌ అని ఎందుకు? అదే టీఆర్‌ఎస్‌ పార్టీని ఉంచొచ్చు కదా? అసలు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరి. ఏపీలో పార్టీ పెట్టే ముందు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కేసీఆరే తెలంగాణ క్యాబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుంది కదా?’’ అని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అమరావతి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టాలని అనేకమంది అడుగుతున్నారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే కేసీఆర్‌ భేషుగ్గా పోటీ చేయవచ్చని, ప్రజలు ఓటు ఎవరికి వేస్తే వారు సీఎం అవుతారని అన్నారు. కేసీఆర్‌ పథకాలను బండి సంజయ్‌ దగ్గర మైకు పెడితే బాగా చెబుతారని ఎద్దేవా చేశారు.


రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుంటే, ఏపీ తరఫున తాము సహకరిస్తామని చెప్పారు. ఏపీ నుంచే గంజాయి సాగు, రవాణా ఎక్కువగా ఉంటోందని నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని మంత్రి దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా.. ‘‘హైదరాబాద్‌కు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయో రంగనాథ్‌ చెప్పలేదా? హైదరాబాద్‌ నిండా ఉన్న డ్రగ్స్‌, మత్తు బిళ్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రంగనాథ్‌ని అడగండి’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-29T08:44:55+05:30 IST