ముందు తరాలకు ఓఝారీ కళ

ABN , First Publish Date - 2021-11-28T09:02:59+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓఝా గోండులకు మాత్రమే తెలిసిన పురాతన ఢాక్రా కళను కాపాడి, ముందుతరాలకు అందించే లక్ష్యంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

ముందు తరాలకు ఓఝారీ కళ

  • ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకుల చొరవ
  • వర్క్‌షాప్‌ ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ

హైదరాబాద్‌, నవంబరు 27: ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓఝా గోండులకు మాత్రమే తెలిసిన పురాతన ఢాక్రా కళను కాపాడి, ముందుతరాలకు అందించే లక్ష్యంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఓఝా గోండులు వివిధ వేడుకల సమయంలో విలక్షణమైన ఢాక్రా కళాకృతులను ఉపయోగించడంతో పాటు సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఓఝా గోండుల్లోని నవతరానికి ఆ కళాకృతులు ఎలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి? అన్న విషయం కూడా తెలియకుండా పోయింది. ఈ అరుదైన కళను కాపాడి, కళాకృతుల గురించి డాక్యుమెంట్‌ చేసి ముందు తరాలకు అందించే లక్ష్యంతో ఐఐటీ-హెచ్‌ డిజైన్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌ మాథ్యూ తన పరిశోధక బృందంతో కలిసి ఓ ప్రాజెక్టు చేపట్టారు.


ఓఝా గోండులకు చెందిన కళాకారుడు ఉల్కా ఇంద్రజిత్‌ ద్వారా నవతరానికి కళాకృతులు ఎలా తయారు చేయాలనే అంశంపై శిక్షణ ఇప్పించారు. ‘దీన్ని మేం ఓఝారీ కళ అని కూడా అంటాం. ఈ తరం వాళ్లు కళాకృతులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడం వల్ల కళ బతుకుతుంది. వాళ్లకు ఉపాధి కూడా లభిస్తుంది’ అని ఓఝా కళాకారుడు ఇంద్రజిత్‌ తెలిపారు. ‘ఓఝా కళను కాపాడడంతో పాటు ప్రపంచానికి తెలియజేయడం మా లక్ష్యం. దీన్ని డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తున్నాం’ అని పరిశోధక బృందం సభ్యులు కృష్ణ త్రివేది, నకాష్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలు పెంపొందించాలనే ఐఐటీ-హెచ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వర్క్‌షాప్‌ దోహదం చేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు.

Updated Date - 2021-11-28T09:02:59+05:30 IST